గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న తమకు పే స్కేల్ అమలు చేయడం ద్వారా న్యాయం చేయాలి. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా జీవో జారీ చేయాలి. పేస్కేల్.. మా 20 ఏళ్ల ఆకాంక్ష. దాన్ని నెరవేర్చి ఆదుకోవాలి.
– నర్సింహాచారి, వీబీజీ రాంజీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్
నల్లగొండ : గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వీబీ జీ రాంజీ (గత ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు పే స్కేల్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జూలై 27 నుంచి విధులకు హాజరవుతూనే పెన్డౌన్, కంప్యూటర్ షట్డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా శాఖకు సేవలందిస్తున్న తమకు ఇప్పటికీ పే స్కేల్ అమలు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వివక్ష..
2006లో జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా వివిధ హోదాల్లో ఎంపికై న ఉపాధి హామీ ఉద్యోగులు 20 ఏళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని డీఆర్డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పే స్కేల్ అమలు చేసింది. కానీ ఉపాధి హామీ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ పే స్కేల్ వర్తింపజేయకపోవడం వివక్షకు నిదర్శనమని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
నెరవేరని హామీ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. 2024 ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రకటన జీవో రూపంలో వెలువడకపోవడంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆగిపోయిన పనులు..
ఉద్యోగులు విధులకు హాజరవుతూనే పెన్డౌన్, కంప్యూటర్ షట్డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జాప్యమవుతున్నాయి. వన మహోత్సవం కార్యక్రమాల అమలు మందగించింది. జలసిరి కార్యక్రమం నిర్వహణపై కూడా సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగం తగ్గిందని అధికారులు అంటున్నారు.
చర్చలపై ఆశలు..
ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 6న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తే ఉద్యమం విరమించే అవకాశం ఉందని, ఒకవేళ విఫలమైతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాలో వీబీజీ రాంజీ
ఉద్యోగులు ఇలా..
ఏపీఓలు 25
ఈసీలు 26
టీఏలు 136
సీవోలు 64
హెచ్ఆర్ మేనేజర్ 1
ప్రాజెక్ట్ ఆఫీసర్ 1
సీడీసీఎల్ ఆర్సీలు 2
మొత్తం 255
సమ్మెలో వీబీజీ రాంజీ ఉద్యోగులు
ఫ జూలై 27 నుంచి ‘పెన్డౌన్ – షట్డౌన్’
ఫ 6న కమిషనర్తో చర్చలు..
ఫ విఫలమైతే ఉద్యమం ఉధృతం
చేస్తామని హెచ్చరిక


