రామగిరి(నల్లగొండ) : ప్రజలు, యువత, విద్యార్థులు అందరం కలిసి మాదక ద్రవ్య సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరాలు మారేకొద్దీ పిల్లల ఆట పాటలు, వ్యసనాలు కూడా మారుతున్నాయని చెప్పారు. ఇప్పుడు మందు, సిగరెట్తో పాటు సామాజిక మాధ్యమాల వ్యసనం, డిజిటల్ వ్యసనం, డ్రగ్స్ వినియోగం పెరిగిందన్నారు. ఒకప్పుడు డబ్బున్న వారికి మాత్రమే డ్రగ్స్ అందుబాటులో ఉండేవని, ఇప్పుడు కిరాణాషాపులో కూడా దొరుకుతున్నాయని ఇందుకు వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టు పక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకొమ్మని బలవంతపెట్టినా, అమ్మినా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2047 భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ముందు డ్రగ్స్ను దూరం పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఇలాంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఎస్పీ రమేష్ విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, నల్లగొండ ఇన్చార్జి రాజయోగి ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్ఓ కె.రాహుల్, జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్.మదన్మోహన్, ఎన్జీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్, మోనిక, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సుధాకర్, వెంకట్రెడ్డి, అనిల్కుమార్, కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, శిరీష పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


