మెరుగైన సేవలు అందిస్తున్నాం
అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని డయాలసిస్ పడకలు
నల్లగొండ టౌన్ : మారుతున్న జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కోసం రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగుల సంఖ్య పెరగడంతో అవి సరిపోవడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ చేస్తున్నా.. కొందరు వెయిటింగ్లోనే ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. 726 మంది రోగులకు నాలుగు షిఫ్టుల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కొందరికి ప్రతి రోజూ, మరికొందరికి రెండు మూడు రోజులకు, ఇంకొందరికి వారంలో రెండు సార్లు, వారానికి ఒక సారి చొప్పున డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది రోగులు డయాలసిస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఆ కేంద్రంలో ప్రస్తుతం డయాలసిస్ పొందే రోగి చనిపోతేనే వెయిటింగ్లో ఉన్న వారికి డయాలసిస్ చేసే పరిస్థితి ఉంది. వెయిటింగ్ లేకుండా డయాలసిస్ చేయాలంటే ఆయా కేంద్రాల్లో పడకల స్థాయిని, మిషన్లను పెంచాల్సిందే.
ఆర్థికంగా భారం
మూత్రపిండాలు చెడిపోయిన వారికి తప్పని సరిగా డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ది చేయాల్సి ఉంటుంది. కానీ డిమాండ్ మేరకు పడకలు లేని కారణంగా డయాలసిస్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి చేయించుకుంటున్నారు. దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం రోగుల డిమాండ్కు తగ్గట్టుగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
డయాలసిస్ కేంద్రాల సేవలు ఇలా..
ఆస్పత్రి పడకలు రోగులు వెయిటింగ్
జీజీహెచ్ 15 135 0
దేవరకొండ 5 50 10
మిర్యాలగూడ 10 92 0
నాగార్జునసాగర్ 5 40 0
మర్రిగూడ 5 30 0
సూర్యాపేట 7 60 0
హుజూర్నగర్ 9 80 0
కోదాడ 5 52 10
చౌటుప్పల్ 5 50 0
భువనగిరి 8 90 0
రామన్నపేట 5 47 0
ఫ పెరుగుతున్న రోగుల సంఖ్య
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ద్వారా డయాలసిస్
ఉమ్మడి జిల్లాలో ఉన్న డయాలసిస్ కేంద్రాల ద్వారా 24 గంటలు పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నాం. ఎక్కడా రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని సేవలను అందజేస్తున్నాం. – మహ్మద్ అఖిల్,
డయాలసిస్ కేంద్రాల ఉమ్మడి జిల్లా మేనేజర్


