కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండడంతో మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ఏడాది జూలై మాసంలో మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 642 (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) అడుగులకు చేరడంతో అధికారులు ఆయకట్టులో పంటల సాగుకు 20 రోజుల కిత్రం నీటిని విడుదల చేశారు. అయితే నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేకపోవడంతో పాటు, కాల్వలకు నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం 638 అడుగులకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మూసీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 324 క్యూసెక్కుల చొప్పున మొత్తం 648 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 2.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


