నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 119 దరఖాస్తులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు 77, ఇతర శాఖలకు సంబంధించి 42 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల నెలవారీ ప్రగతి నివేదికలను ఆగస్టు 3లోగా జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)కి సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ– భారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించే చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డిప్యూటీకలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


