నల్లగొండ టూటౌన్ : సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నల్లగొండను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.65 కోట్లతో నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్యతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో మేయర్, కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్లై ఓవర్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా నల్లగొండ నగరాన్ని మోడల్ కార్పొరేషన్గా సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. నార్కట్పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై నేరుగా వాహనాలు ప్రయాణించేందుకు ఫ్లై ఓవర్ నిర్మించామని తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా తీర్చిదిద్దామని, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్బాపూజీ, ఛాయా సోమేశ్వర స్వామి, మహనీయుల చిత్రాలతో సుందరీకరించినట్లు తెలిపారు. రూ.750 కోట్లతో చేపట్టిన నల్లగొండ ఔటర్రింగ్ రోడ్డు పనులు 50 శాతం పూర్తయ్యాయని, రైల్వే ట్రాక్పై బ్రిడ్జి నిర్మాణం, తదితర పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అమృత్ పథకం కింద రూ.300 కోట్లతో తాగునీటి ట్యాంకులు, యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటికి అదనంగా రూ.300 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. 24/7 తాగునీటి సరఫరా పైలెట్ ప్రాజెక్టుగా నల్లగొండను ఎంపిక చేసి రూ.290 కోట్లతో ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించే కార్యక్రమం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమేర్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, కార్పొరేటర్లు గుమ్మల జానకి, పెరిక స్వాతి, బొడ్డుపల్లి లక్ష్మి, శంకర్, కేసాని వేణుగోపాల్రెడ్డి, ఇబ్రహీం, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఫ నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం


