నవంబర్ నాటికి నిర్మాణాలు పూర్తిచేసేలా అధికారుల కసరత్తు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ మహిళా సంఘాలకు సమాఖ్య భవనాలు మంజూరు చేసింది. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు శాశ్వత వేదికలు ఉండేలా చేపట్టిన గ్రామ సమాఖ్య భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిని ప్రతి గ్రామంలోని మహిళా పొదుపు సంఘాలు (ఎస్హెచ్జీ) కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్ జీ) కింద జిల్లాకు మంజూరు చేసింది. గ్రామ మహిళా సంఘం భవనం (వీవో)లు ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. డిసెంబరు మాసంలో ఎట్టి పరిస్థితుల్లో నూతన భవనాల్లోకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని మహిళా సంఘాలు కలిసి సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం జిల్లాకు మొత్తం 224 వీవో భవనాలు ఈ ఏడాది జనవరిలో మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో స్థలాలు కూడా దొరకడంతో స్థానిక సర్పంచ్లు, సంబంధిత అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. అయితే వీటి నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. పాత కాంట్రాక్టర్లను, స్థానిక సర్పంచులు ఎలాగోలా ఒప్పించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లాలో లింగాల మండలం రాంపూర్, బాకారంతోపాటు మొత్తం 21 వీవో భవనాలు అన్ని హంగులతో పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 182 భవనాల పనులు పురోగతిలో ఉండగా.. సైట్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. మరో 21 చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ వీవో భవనాల పనులపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ భవనాలు పూర్తయితే గ్రామాల్లో మహిళా సంఘాల సమావేశాలు,ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చక్కని వేదికగా మారనున్నాయి.
శాశ్వత వేదికలు ఉండాలనే
ఉద్దేశంతో కార్యాలయాల మంజూరు
ఒక్కో భవనానికి
రూ.10 లక్షల చొప్పున నిధులు
అన్ని రకాల వసతులు
కల్పించేందుకు చర్యలు
మహిళా సాధికారతకు
పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం


