కొల్లాపూర్: నియోజకవర్గాల పునర్విభజన దేశానికే ప్రమాదకరమని, డీలిమిటేషన్ ప్రక్రియలో శాసీ్త్రయత లోపించడం కారణంగా ఉత్తర భారతం, దక్షిణ భారతం అని రెండు భాగాలుగా దేశం విడిపోయే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ ఈ నెల 6 నుంచి జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కొల్లాపూర్లో ముగిసింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డీలిమిటేషన్కు తొందర అవసరం లేదని, 2026 జనాభా గణన ముగిసిన తర్వాత, 2029లో పునర్విభజన శాసీ్త్రయంగా చేపట్టి, 2031లో దాన్ని అమలుచేయాలని సూచించారు. మహిళలు, వారి అభివృద్ధిపై కేంద్రానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే నూతన బిల్లుతో సంబంధం లేకుండా ఇప్పుడున్న రిజర్వేషన్లలో 33 శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో సీపీఐ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ భాగస్వామిగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు చర్యలు చేపట్టాలన్నారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలను అధికారులకు తెలియజేస్తామని, వారు స్పందించకుంటే ప్రజా ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్జీ, కేశవులు గౌడ్, ఇందిర, శివుడు, యూసుఫ్, కుర్మయ్య, లక్ష్మీపతి, విజేయుడు, వెంకటస్వామి, కిరణ్కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


