పనులపై నిరంతర పర్యవేక్షణ
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్ల మంజూరు
● మహిళా సంఘాల భవనాలు, రద్దీ
ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు
● అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం
నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు.
గతంలో జాప్యం.. ఇప్పుడు వేగం
గతంలో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, పంచాయతీ శాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు.
జిల్లా మ.సం.భ మంజూరైన నిధులు
నాగర్కర్నూల్ 209 రూ.1.77 కోట్లు
నారాయణపేట 45 రూ.52.50 లక్షలు
మహబూబ్నగర్ 427 రూ.2.36 కోట్లు
వనపర్తి 73 రూ.66.89 లక్షలు
జోగుళాంబ గద్వాల 50 రూ.49.73 లక్షలు
మ.సం.భ : మహిళా సంఘాల భవనాలు
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశానిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూనిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు.
– వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట


