విద్యుత్ అక్రమంగా
వినియోగిస్తే చర్యలు
వెల్దండ: ఎవరైనా విద్యుత్ అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి హెచ్చరించారు. బుధవారం వెల్దండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో డీపీఈ డీఈ కామేశ్వర్రావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు 24 బృందాలుగా ఏర్పడి.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మండల విద్యుత్శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్ఈ మాట్లాడారు. గ్రామాల్లో విద్యుత్ అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు కల్వకుర్తి, అచ్చంపేట సబ్ డివిజన్ ఇంజినీర్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు వివరించారు. ఈ దాడుల్లో మొత్తం 120 కేసులను నమోదు చేశామన్నారు. ఏడీఏ శంకరయ్య, ఆంజనేయులు, టెక్నికల్ డీఈ రవికుమార్, ఏఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, జానకీరాంనాయక్ పాల్గొన్నారు.
కందనూలు: ఎయిడ్స్ వ్యాప్తికి అడ్డుకట్ట పడేందుకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవీపై భయపడాల్సిన అవసరం లేదని.. సరైన అవగాహనతో నివారించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులపై సమాజంలో ఎలాంటి వివక్ష, అవమానం, నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్యసేవలు, మానసిక ధైర్యం, కుటుంబ, సామాజిక మద్దతు అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో హెచ్ఐవీ నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా .కృష్ణ, డా.రవినాయక్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బిజినేపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతుల నిర్వహణ, విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం హాజరు రిజిస్టర్లు, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు వారికి అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని పాఠశాల ప్రత్యేకాధికారికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎక్కువ సమయం గడిపే పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. పాఠశాలలో వారికి అవసరమైన సదుపాయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీఓ కథలయ్య ఉన్నారు.


