● డీజీపీ కార్యాలయానికి అటాచ్
చేస్తూ ఉత్తర్వులు
● ఇన్చార్జి డీఐజీగా
షాన్వాజ్ ఖాసీం
మహబూబ్నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి.


