జిల్లా పరిధిలో ఇలా..
నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరోదఫా మూడు నెలల బియ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఎల్నినో ప్రభావంతో నెలకొంటున్న కరవు పరిస్థితులు.. రవాణా వ్యయం.. ఇతరత్రా కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన బియ్యం ఆగస్టులోనే లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్లో పంపిణీ చేయగా.. ఆగస్టులో సైతం అలాగే పంపిణీ చేస్తామని ప్రకటించడంతో కొందరు డీలర్లు దుకాణాల్లో స్థలం కొరత ఉందని ఇతరత్రా కారణాలు చూపి నెలవారిగానే బియ్యం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వారి అభ్యంతారాన్ని తోసిపుచ్చి పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూడు నెలల బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
68 శాతం లబ్ధిదారులకు..
జిల్లావ్యాప్తంగా 552 రేషన్ దుకాణాలు ఉన్నాయి. నెలవారిగా ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇచ్చేవారు. కాగా ఈసారి మూడు నెలలకు సంబంధించి 18 కిలోల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు ఇవ్వగా.. ఇప్పుడు 105 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 30 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. అయితే జూలై నెలకు సంబంధించి 2,78,681 తెల్లకార్డుదారులకు 5,866 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా.. రేషన్ షాపుల్లో 68 శాతం లబ్ధిదారులకు సరఫరా చేశారు. 4,011 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా అన్ని దుకాణాల్లో కలిపి 1,855 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 20 మండలాల్లోని 552 రేషన్ దుకాణాల్లో మిగిలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉండటంతో కొందరు కార్డుదారులు ఇతర ప్రాంతాల్లో తీసుకోవడంతో 68 శాతమే సరఫరా అయ్యింది.
ఈకైవెసీ తప్పనిసరి..
రేషన్ కార్డు దారులు ఈకైవెసీ తప్పనిసరిగా చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు చివరి తేదీ కావడంతో కార్డులో ఉన్న వారందరూ రేషన్ దుకాణాలు, మీసేవల్లో వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోవాలని, లేకపోతే బియ్యం ఇవ్వడం ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.
మొత్తం లబ్ధిదారులు 8,97,738
డీలర్లకు సూచించాం..
జిల్లాలోని రేషన్ దుకాణాలకు మూడు నెలల బియ్యం పంపిణీ వేగంగా సాగుతుంది. 20 మండలాల్లోని 552 రేషన్ షాపులకు గాను 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల కోటా తీసుకుపోవాలని డీలర్లకు సూచించాం. లబ్ధిదారులు కచ్చితంగా ఈనెలలోనే ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి.
– హైదర్అలీ, డీఎస్ఓ
జిల్లాకు 17 వేల మె.ట., బియ్యం కేటాయింపు
సాఫ్ట్వేర్ సమస్యతో దుకాణాలకు ఆలస్యంగా బియ్యం సరఫరా
లబ్ధిదారులకు రేపటి నుంచి.. నెలరోజులపాటు పంపిణీ
రేషన్ దకాణాలు
552
తెల్లరేషన్ కార్డులు
2,59,984
అంత్యోదయ
18,669
అన్నపూర్ణ
28


