కందనూలు: జిల్లాలోని యువతీ, యువకులకు ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ బయో ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో 50 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తి గల 30 ఏళ్లలోపు నిరుద్యోగులు బుధవారం ఉదయం 10.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 76669 74704, 98854 62005లను సంప్రదించాలని కోరారు.
నేడు స్పాట్ అడ్మిషన్లు
కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మిగిలిన సీట్లకు 6వ తరగతి నుంచి 12 వరకు మంగళవారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేంద్రశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ సీట్లు ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఐటీడీఏ పీఓగా ఆర్డీఓ యాదగిరి
మన్ననూర్: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా (పీఓ) డిప్యూటీ కలెక్టర్, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా ఈ స్థానంలో కలెక్టర్ బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ నిబంధనల ప్రకారం నిర్వహణ కొనసాగించడంతోపాటు ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఏఓ జాఫర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన
పిల్లలతోనే దేశ భవిష్యత్
కందనూలు: ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సంలో ఆమె పాల్గొని చిన్నారులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో పిల్లలలో నులిపురుగులను నిర్మూలించి, పిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చన్నారు. పిల్లల్లో నులి పురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక, శారీరక ఎదుగుదల లోపం, కడుపు నొప్పి, తరచుగా అనారోగ్యానికి గురవడం వంటివి జరుగుతాయన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చదువులో మెరుగ్గా రాణిస్తారన్నారు. కాబట్టి జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. డీఎంహెచ్ఓ కృష్ణ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్ప్రబావాలు ఉండవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు నిస్సందేహంగా మాత్రలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సురేష్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, పాఠశాల జీహెచ్ఎం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


