కందనూలు: ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రైవేట్కు కొమ్ముకాస్తున్న డీఈఓ రమేష్కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతోపాటు కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2024లో జిల్లాకేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ, డీఈఓలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అచ్చంపేటలోని ఓ పాఠశాలపై బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా, కమిషన్ విచారణ చేయాలని డీఈఓను ఆదేశించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పలు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై సమాచారం అందించినా ‘అమ్ముకోవచ్చు’ అనే సమాధానం ఇవ్వడం విచారకరమన్నారు. తమ సమస్యలను వివరించేందుకు డీఈఓను కలవడానికి వెళ్లిన సిబ్బందితో మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తూ, ‘ఏమైనా ఉంటే ఇన్వార్డులో ఇచ్చి వెళ్లండి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై వచ్చిన అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.


