● ఆర్థిక వనరులను
పెంపొందించుకోవాలి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
కందనూలు: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. స్వంత ఆర్థిక వనరులను పెంపొందించుకొని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ–2026) రూపకల్పనపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి లక్ష్యాలను గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావడం అత్యంత అవసరమన్నారు. ప్రతి జీపీలో శాశ్వత ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు ఈ నెల 24వ తేదీలోగా పూర్తయ్యేలా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ పాలనకు సర్పంచులే కేంద్ర బిందువని అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, యువత అభ్యున్నతి, వ్యవసాయాభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఏఓ చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, మిషన్ భగీరథ ఈఈ శ్రీదేవి ఉన్నారు.
● సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్తో కలిసి వీసీ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేసిన డేటా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను సరిచూసుకొని ఈ నెల 24వ తేదీలోగా డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా.. అనర్హులు జాబితాలోకి చేరకుండా క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ అరుణరెడ్డి, ఆర్డీఓలు అర్చన, బన్సీలాల్, యాదగిరి ఉన్నారు.


