● రైతులను కార్యాలయాల చుట్టూ
తిప్పించుకోవద్దు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కల్వకుర్తి/కొల్లాపూర్: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో భూ సమస్యలపై సమీక్షించారు. జిల్లాలో భూ భారతి దరఖాస్తులు, అటవీ సమస్యల పరిష్కారం, వనమహోత్సవంపై చర్చించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని.. కొల్లాపూర్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పెండింగ్లో ఉండొద్దని సూచించారు. అంతకుముందు కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్లతో చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫైళ్లను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పంపుతున్నారు తప్ప.. ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వెలిబుచ్చారు. రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరైంది కాదన్నారు. అనంతరం పలు రికార్డులను ఆయన అధికారుల సమక్షంలోనే పరిశీలించారు. పోడు భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, లావునీ పట్టాలు, హార్టికల్చర్ కళాశాల, పర్యాటక భవనాల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ, మొదలైన 16 అంశాలపై సమీక్షలో చర్చించారు. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు అటవీ భూములకు పట్టాలు ఇప్పిస్తున్నారని ప్రచారం జరగడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తమకు పట్టాలు ఇప్పించాలని వారు మంత్రికి విన్నవించారు.
దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్లో ఆయన విగ్రహానికి మంత్రి జూపల్లి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గానికి చెందిన జగ్జీవన్రామ్ దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


