● అన్ని శాఖలు సమన్వయంతోపనిచేయాలి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
కందనూలు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఊర్కొండ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని సీఎం దర్శించనున్న నేపథ్యంలో మంగళవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి.. వేద ఆశీర్వాదాలు పలికారు. అనంతరం అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆలయ దర్శనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆలయ ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, పచ్చదనం రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉర్కొండపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఊర్కొండ మండలంలో ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ మండలస్థాయి అధికారుల కార్యాలయ సముదాయం, నూతన పోలీస్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేపట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, జిల్లా ఏడీ సర్వేయర్ గిరిధర్, తహసీల్దార్ యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.


