ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్ దేశంలో విద్యావ్యవస్థను అధ్యయనం చేయడానికి మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ కొయ్యడ మల్లయ్య నేడు జపాన్కు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించి అక్కడ పాఠశాల విద్యా వ్యవస్థను పరిశీలించి, పరిశోధన చేసి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది సభ్యుల బృందంతో జపాన్ బయలుదేరుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి రామన్నగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొయ్యడ మల్లయ్య ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్నికోలస్, అసిస్టెంట్ డైరెక్టర్ లింగయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్లో ఈనెల 2వ తేదీన వీరందరికీ వీసాలు అందజేశారు. ఈ క్రమంలో జపాన్ వెళ్తున్న మల్లయ్యకు డీఈఓ సిద్ధార్థరెడ్డి అభినందనలు తెలిపారు.
రామప్పలో
జియోలాజికల్ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీవీ ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట జీఎస్ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, భద్రు ఉన్నారు.
పౌష్టికాహారం అందించాలి
గణపురం: గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి ముధుసూదన్ అన్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన పౌషకాహార వారోత్సవాల్లో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గర్భదారణ సమయంలో పౌషకాహారం తీసుకోవడం వలన తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఐటీఐ ప్రవేశాలకు
చివరి అవకాశం
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 7వ తేదీతో చివరి గడువు ముగియనున్నట్లు స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జూమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాక్ ఇన్ అడ్మిషన్ పద్ధతిలో తక్షణ అడ్మిషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను మూడో విడత భర్తీచేయనున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కళాశాలలో అడ్మిషన్కు హాజరుకావాలని సూచించారు.
నిర్మాణ పనుల పరిశీలన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, పాలవవర్గం డైరెక్టర్ మంచినీళ్లు దుర్గయ్య, దొడ్ల అశోక్ శనివారం పరిశీలించారు.


