ఎస్ఎస్తాడ్వాయి/వెంకటాపురం(కె): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శనివారం తాడ్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య, తాడ్వాయి సర్పంచ్ గంట ప్రవళికల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహరదారిపై నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లక్ష్మణ్బాబు, నాగజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు పలు హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, జిల్లా నాయకుడు భూక్య జంపన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మోహన్రావు, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శైలజ, మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల బైక్ ర్యాలీ
అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్బాబు హాజరై బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులను అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడవర్తి నర్సింహామూర్తి, గంపా రాంబాబు, రామకృష్ణ కృష్ణారెడ్డి, ముడుంబా శ్రీనివాస్, కాకులమర్రి ప్రదీప్రావు, సర్పంచ్లు రమ్య, ఆదిలక్ష్మి, మురళి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు,
జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి
వెయ్యి రోజుల పాలనకు నిరసనగా
వంటావార్పు, బైక్ ర్యాలీ


