ఢీ అంటే ఢీ | - | Sakshi
Sakshi News home page

ఢీ అంటే ఢీ

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు ఒకే చౌరస్తాలో దాదాపుగా ఒకే సమయంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకుంటూ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపడంతో ఇబ్బంది తలెత్తలేదు.

కాసేపు హై టెన్షన్‌..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని హనుమాన్‌ దేవాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకున్నాక ఎమ్మెల్యే.. విలేకరులతో మాట్లాడారు. అప్పటికే సినిమా థియేటర్‌లో వేచి ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు అదే సమయంలో సెంటర్‌కు చేరుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులను కాసేపు ఆపారు. ఇరుపార్టీల నాయకుల మధ్య అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడటం పూర్తయ్యాక వెళ్లిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించాక అంబేడ్కర్‌ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. శనివారం జిల్లాకేంద్రంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు ముందే భారీఎత్తున అక్కడకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement