వాజేడు: ఆదివాసీల ఉద్యోగాల కల్ప నకు చేపట్టిన రాష్ట్రంలోని ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పలు ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన కొమరంభీమ్ విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల హక్కులను పొందుతున్నారన్నారు. ఉద్యోగాలు, నిధులు నియామకాలలో నిత్యం ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవడానికి రేపు(సోమవారం) ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా 16న ఊట్నూరు, 21న భద్రాచలం, 28న మన్ననూరు ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి కోటేశ్వర్లు, జానకి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జీఎస్పీ మండల అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


