ములుగు: సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి ఉపాధ్యాయుల కృషే కారణమన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. రానున్న రోజుల్లో విద్యారంగంలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన ప్రశంసపత్రాలు అందజేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్


