వుులుగు: విద్యార్థులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ అన్నారు. ఐఐటీ–హైదరాబాద్, టీఎస్–హైదరాబాద్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు మెరుగైన విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీలో గురువారం 2026–27 విద్యా సంవత్సర ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఐటీ–హైదరాబాద్ అధ్యాపకులు బీటెక్ విద్యార్థులకు నేరుగా బోధించనున్నారని, టీఎస్–హైదరాబాద్ నిపుణులు ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సు నిర్వహించనున్నారని తెలిపారు. విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసే నాటికి ఉద్యోగాలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రానున్న అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఏడాదిలో క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఐఐటీ–హైదరాబాద్ స్టార్టప్, ఇన్నోవేషన్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుతూ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రకాశ్, బీఎస్ మూర్తి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్క సారక్క వర్సిటీ వీసీ
ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్


