ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ జిల్లా కేంద్రంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు శివారులోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వరకు కొనసాగింది. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి.. 1000 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి, జిల్లా నాయకులు గోవింద్ నాయక్, మల్కా రమేశ్, భూక్య జంపన్న, మహేశ్, విజయ్, మల్లారెడ్డి, వలిబాబా, ఖాజాపాషా, తాడూరి రఘు తదితరులు పాల్గొన్నారు.
420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ


