ఏటూరునాగారం: ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి నాలుగేళ్లకు మొదలవుతుంది. అప్పటి వరకు తోటల్లో భూమిని ఖాళీగా వదిలేయకుండా అదనపు ఆదాయం కోసం అంతర పంటలను సాగు చేస్తున్నారు. మొదటి మూడేళ్లలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు సాగుపై మొగ్గు చూపుతున్నారు. దీంతో మిర్చి, కూరగాయలు, బొప్పాయి, అరటి, పసుపు, పైనాపిల్, వరి, పొగాకు, అల్లం, మొక్కజొన్న మొదలగు పంటలు సాగు చేస్తున్నారు.
జిల్లాలో 4,183 ఎకరాల్లో సాగు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఆయిల్పామ్ తోటలు 2025–26లో 3,733 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే 2026–27లో మరో 450 ఎకరాల్లో మొక్కలను నాటారు. మొత్తంగా 4,183 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలను రైతులు సాగు చేశారు. ఈ క్రమంలో అదనపు ఆదాయం కోసం సుమారు 2,403 ఎకరాల్లో అంతర పంటలు సాగు అవుతుందని వివరించారు. దీనివల్ల జిల్లాలో ఆహార పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇలా అంతర పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఆదాయం, కూలీలకు పనులు, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
6వ సంవత్సరంలో..
ఆయిల్పామ్ తోటల్లో 6వ సంవత్సరం నుంచి వక్క, మిరియాలు, దాల్చన చెక్క, లవంగాలు, జాజికాయ జాపత్రి వంటి ఆహార పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉందని హార్టికల్చర్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ పంటలే కాకుండా పెరటి కోళ్లు, తేనే టీగలు, గొర్రెలు, పశువుల గడ్డిని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. అంతర పంటల వల్ల అదనపు ఆదాయంతో పాటు నీరు సైతం ఆదా అవుతుంది. కూలీలకు ఈ పంటల వల్ల 365 రోజులు పని దొరికే అవకాశం ఉంటుంది. అలాగే భూమికి మరింత విలువ పెరుగుతుంది.
జిల్లాలో 4,183 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు
2,403 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్న రైతులు
రైతులు ముందుకు రావాలంటున్న హార్టికల్చర్ అధికారులు


