
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.
కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది.