న్యూ ఇయర్‌ జోష్‌.. ఫ్యాన్స్‌ ఖుష్‌

Tollywood Heroes Cinemas Line Up Release In New Year 2022 Full Josh - Sakshi

గడచిన ఏడాది చివరి రోజు వచ్చిన సినిమాల కొత్త అప్‌డేట్స్‌తో సినీ లవర్స్‌లో న్యూ ఇయర్‌ జోష్‌ ఆరంభమైంది. ఆ అప్‌డేట్స్‌లోకి వస్తే...‘లాహే లాహే.., నీలాంబరి’ పాటల తర్వాత ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘సాన కష్టం..’ అనే మాస్‌ పాట లిరికల్‌ వీడియో ఈ నెల 3న విడుదల కానుంది. చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇటు ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం టీజర్‌ నేడు రిలీజ్‌ అవుతోంది.

నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. అటు ‘భీమ్లా నాయక్‌’ కొత్త సౌండ్‌ వినిపించాడు. పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్‌ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ  చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘రామం రాఘవం’ మ్యూజిక్‌ వీడియో రిలీజైంది. రైజ్‌ ఆఫ్‌ రామ్‌గా వచ్చిన ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ మెరిశారు. ఈ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

అటు ‘అట్టా సూడకే..’ అంటూ మాసీ స్టెప్పులేశారు ‘ఖిలాడి’. రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరో హీరోయిన్లుగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ నుంచి ‘అట్టా సూడకే’ పాట లిరికల్‌ వీడియో విడుదలైంది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌  కానుంది. మరోవైపు çపూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన  ‘లైగర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలయింది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.

ఇంకోవైపు ‘మేజర్‌’ హిందీ వెర్షన్‌కి డబ్బింగ్‌ చెబుతున్నారు అడివి శేష్‌. వీరజవాన్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌ పాత్ర చేశారు శేష్‌. ముంబై 26/11 దాడుల ఆధారంగా జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ ఫ్లస్‌ ఎస్, సోనీ పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. కొత్త ఏడాదికి తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు శ్రీ విష్ణు. వేదరాజ్‌ టింబర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభిస్తాం. ఓ విభిన్న కథాంశంతో సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు వేదరాజ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top