
ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. శ్రద్ధా కపూర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు. ‘‘ఏ... నాటకాలు ఆపు... నీకేం కాలేదు, నా కొడుకు సైతాన్... సైతాన్, నేను నీతో ఉండలేను... మా ప్రపంచం వేరు’’ అని అర్థం వచ్చే డైలాగ్స్ ఈ హిందీ ట్రైలర్లో ఉన్నాయి. దీపావళి పండగ సందర్భంగా ‘థామా’ సినిమాను అక్టోబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు.