
కోలీవుడ్ అగ్రనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మణిరత్న- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.
అయితే బెంగళూరులో కమల్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటక రిలీజ్ చేయలేదు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించింది. ఈ వివాదంపై కమల్ హాసన్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ను కర్ణాటకలో అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మీ కర్తవ్యమని కర్ణాటక ప్రభుత్వానికి గుర్తు చేసింది.
సుప్రీం తీర్పుతో థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ విచారణను ముగించింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.