సందడే సందడి | Star heroes are busy with Shootings: Tollywood | Sakshi
Sakshi News home page

సందడే సందడి

Jun 27 2025 3:01 AM | Updated on Jun 27 2025 7:11 AM

Star heroes are busy with Shootings: Tollywood

భాగ్యనగరంలో భలే జోరుగా షూటింగ్‌ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోస్‌. సందడి సందడిగా ఈ షూటింగ్స్‌ జరుగుతున్నాయి. మరి... హైదరాబాద్‌లో ఏ స్టార్‌ ఎక్కడెక్కడ షూటింగ్‌ చేస్తున్నారో తెలుసుకుందాం.

షామిర్‌పేటలో...  
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన చిరంజీవి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్‌ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక పాట మినహా ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు చిరంజీవి. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అనిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌ సమీపంలోని షామిర్‌పేటలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్‌ ఉంటుందని, జూలై 1 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవుతుందనీ తెలిసింది. చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఆయన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీతో ఈ సినిమా రూపొందుతోందని టాక్‌. ‘మెగా 157’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.  

అఖండ తాండవం  
హీరో బాలకృష్ణ, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్‌లో రూపొందుతోన్న నాలుగో చిత్రమిది. సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. 

ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌కి సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది.  

ఆర్‌ఎఫ్‌సీలో...  
వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారట హను రాఘవపూడి. ‘సీతారామం’ వంటి హిట్‌ మూవీ తర్వాత ఏడాదికిపైగా సమయం తీసుకుని ‘ఫౌజి’ కథను తీర్చిదిద్దారు దర్శకుడు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్‌ యువరాణి పాత్ర చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.  

ఆటా పాటా 
ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్, దేవర’ వంటి వరుస హిట్‌ చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘కేజీఎఫ్, సలార్‌’ చిత్రాల ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో భాగంగా ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. అయితే ఇది రెగ్యులర్‌ సాంగ్‌ కాదని, దేశభక్తి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా, మలయాళ నటుడు టొవినో థామస్‌ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2026 జూన్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

శంకర్‌పల్లిలో...  
హీరో మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. అయితే ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని... నెగటివ్‌ క్యారెక్టర్‌ అని టాక్‌.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలోని ఓ స్టూడి యోలో జరుగుతోంది. అమేజాన్‌ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్‌ వేశారట. ప్రస్తుతం మహేశ్‌బాబు, ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్‌ సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.  

మొయినాబాద్‌లో... 
హీరో రవితేజ, దర్శకుడు కిశోర్‌ తిరుమల కాంబినేషన్ లో ‘ఆర్‌టీ 76’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌కి సమీపంలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

రవితేజతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్‌ మార్క్‌ కామిక్‌ టైమింగ్, మాస్‌ అప్పీల్‌ మిస్‌ అవకుండా కథను సిద్ధం చేశారు కిశోర్‌ తిరుమల. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్‌గా మేకోవర్‌ అయ్యారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.  

అల్యూమినియం ఫ్యాక్టరీలో...  
రామ్‌ పోతినేని హీరోగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ మూవీ ఫేమ్‌ మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ర్యాపో 22’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ గబ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్‌ నైట్‌ షూటింగ్‌ చేసిన అనంతరం తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు యూనిట్‌.  

ముచ్చింతల్‌లో...  
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ఫ్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నానితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట శ్రీకాంత్‌ ఓదెల. ఈ సినిమాలో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు నాని. ‘ది ఫ్యారడైజ్‌’ నుంచి ‘రా స్టేట్‌మెంట్‌’ పేరుతో ఇప్పటికే విడుదలైన ఓ గ్లింప్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న రిలీజ్‌ కానుంది.  

తుక్కుగూడలో...  
‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై ‘హను మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో పాటు ప్రముఖ తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్‌. ఈ సినిమా సెప్టెంబర్‌ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.  

గండిపేటలో...  
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌’ చిత్రాల ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనసును హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శంషాబాద్‌లో...  
‘జాతి రత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రాల ఫేమ్‌ నవీన్  పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ శంషాబాద్‌లో జరుగుతోంది. నవీన్  పొలిశెట్టితో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.  

ప్రముఖ స్టూడియోలో...
‘హనుమాన్‌’ (2024) చిత్రంతో పాన్‌ ఇండియన్‌ హిట్‌ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మనోజ్‌ మంచు, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. టీమ్‌ అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ హైలైట్‌గా నిలవనున్నాయి. ‘మిరాయ్‌’ 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్‌లో సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.  - డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement