గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.
అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది.
ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం.


