
ఇటీవల సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో పలువురి సినీతారల అకౌంట్స్ను హ్యాకింగ్ గురైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా సింగర్ వెల్లడించింది. దాదాపు రెండు వారాలైనా తన ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎవరూ కూడా తన ట్విటర్ ఖాతా నుంచి వచ్చే పోస్టులు, లింక్స్ను క్లిక్ చేయొద్దని అభిమానులకు సూచించింది.
తన ఇన్స్టాలో శ్రేయా ఘోషల్ రాస్తూ..' నా అభిమానులు, స్నేహితులకు ఒక్కటే విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. దీనిపై ఎక్స్ బృందాన్ని సంప్రదించేందుకు శతవిధాలా ప్రయత్నించా. కానీ ఆటో జనరేటెడ్ రెస్పాన్స్ల ద్వారా నాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. నా ఖాతాను డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయలేకపోతున్నా. కనీసం నా ఖాతా లాగిన్ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. దయచేసి నా ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్లను ఎవరూ కూడా క్లిక్ చేయొద్దు. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేసేజులు, లింకులను క్లిక్ చేయొద్దు. నా ఖాతా రికవరీ అయిన వెంటనే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా' అని సింగర్ రాసుకొచ్చింది.