
సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటుడు శ్రేయస్ తల్పడే అలానే దొరికిపోయాడు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఇతడు.. పుష్ప 2 హిందీ వెర్షన్ అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇతడిపై పోలీసులు కేసు పెట్టారు. ఇంతకీ ఏంటి విషయం?
ఉత్తరప్రదేశ్ మహోబ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో నటుడు శ్రేయస్ తల్పడేతో పాటు మరో 14 మందిపై కేసు పెట్టారు. దాదాపు పదేళ్ల నుంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీతో శ్రేయాస్ కి సంబంధం ఉందని అంటున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
పలువురు గ్రామస్థుల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలని ఈ కంపెనీ వసూలు చేసిందని, రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారట. ఇప్పటికే ఏజెంట్లతో పాటు సదరు కంపెనీ బోర్డ్ తిప్పేసినట్లు తెలుస్తోంది.
ఇదే కాదు గత నెలలోనూ శ్రేయస్ పై ఇలాంటి కేసు నమోదైంది. దాదాపు రూ.9 కోట్లని పెట్టుబడి దారుల దగ్గర నుంచి తీసుకుని తిరిగి ఇవ్వలేదని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకు ముందు హర్యానాలోని సోనిపట్ లోనూ శ్రేయస్ పై మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో కేసు నమోదైంది.
(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?)