‘‘సింగ్ గీతం’ పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. కుబేరపురం అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలో అందరూ పాటల రూపంలో ఎందుకు మాట్లాడతారు? అనేది థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిందే. ఇలాంటి జానర్లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు’’ అని శాలిని కొండెపుడి తెలిపారు.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాలిని కొండెపుడి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మై డియర్ దొంగ, జయమ్మ పంచాయితీ, శుభం’ వంటి చిత్రాలు చేశాను.
‘సింగ్ గీతం’లో నా పాత్ర నెగటివ్ షేడ్లో ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వంతో పాటు తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. సింగీతం, నాగ్ అశ్విన్గార్ల విజన్తో పాటు వారి సెన్సిబిలిటీస్ కూడా ఈ మూవీలో కనిపిస్తాయి. సింగీతంగారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్గారు మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. నాగ్ అశ్విన్గారు నిర్మించిన ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం కథ రాస్తున్నాను. ఈ మూవీకి నేనే దర్శకత్వం వహిస్తాను’’ అని తెలిపారు.


