‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్‌

Renu Desai Reacts On Mahesh Babu Sarkaru Vaari Paata Movie - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రేణు ఇదంతా ఉట్టి పుకార్లేనని, తనపై ఎలాంటి వార్తలు వచ్చిన నమ్మద్దోని సూచించారు అభిమానులకు సూచించారు. ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్పష్టం చేస్తానన్నారు. ఈ క్రమంలో ఆమె మహేష్‌ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె మహేష్‌కు వదినగా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల లైవ్‌ చాట్‌లో పాల్గొన్న రేణు ‘సర్కారు వారి పాట’ సినిమాలో తను నటించడం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా నేను 'మేజర్' సినిమాలో నటించనున్నట్లు ప్రచారం చేశారు. ఇప్పడు మహేష్‌కు వదినగా నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నేను నటిస్తే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ ఆమె చెప్పకొచ్చారు.  (చదవండి: ‌అడవి శేష్‌ ‘మేజర్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..!)

ఇక తెలుగులో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా రేణు ఇప్పటికే ఓ చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేగాక మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. దీనితో పాటు రైతుల సమస్యలపై ఓ సినిమాను నిర్మించేందుకు కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు. కాగా ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మించనున్నాయి. ఇందులో కీర్తీ సురేశ్‌ తొలిసారిగా మహేష్‌కు ఈ సినిమాతో జోడికట్టారు. బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనున్నారు. (చదవండి: రేణూ దేశాయ్‌కు కరోనా?: నటి స్పందన)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top