‘నాకన్నా నితిన్‌, కీర్తి ఎక్కువ నమ్మారు’ | Rang De Movie Director Venky Atluri Exclusive Interview | Sakshi
Sakshi News home page

నాకన్నా నితిన్‌, కీర్తి ఎక్కువ నమ్మారు: వెంకీ అట్లూరి

Mar 26 2021 3:02 AM | Updated on Mar 26 2021 8:21 AM

Rang De Movie Director Venky Atluri Exclusive Interview - Sakshi

‘‘నా జీవితంలోని ప్రేమకథలనే నేను సినిమాలుగా తీస్తున్నానని కొందరు అంటారు. అది కరెక్ట్‌ కాదు. నా జీవితంలో ప్రేమకథలే లేవు. నా తొలి రెండు చిత్రాలు ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’లో ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ‘రంగ్‌ దే’లో హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు వెంకీ అట్లూరి. నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్‌ దే’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు.

► ‘రంగ్‌ దే’ కథను నితిన్‌ కు చెప్పినప్పుడు ఆయన కమర్షియల్‌ సినిమా ‘భీష్మ’ చేస్తున్నారు. అలాగే ‘పవర్‌పేట’ అనే ఓ పొలిటికల్‌ మూవీ కమిటయ్యారు. ఈ సమయంలో నా కథకు ఓకే చెబుతారా? అనిపించింది. కానీ ఓకే అన్నారు. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే నితిన్, కీర్తి సినిమాకు ఓకే చెప్పారు. ఈ కథను ఇద్దరూ నాకన్నా ఎక్కువగా నమ్మారు. వారి నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది.

► పక్క పక్క ఇళ్లల్లో ఉండే ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య చదువు, కెరీర్‌... ఇలా ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు. అందుకే మొదట్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ‘రంగ్‌ దే’ కథ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. కెమెరా మ్యాన్‌  పీసీ శ్రీరామ్‌గారితో వర్క్‌ చేయడం వల్ల దర్శకుడిగా మెరుగయ్యాను. నా తర్వాతి సినిమాను సితార, ‘దిల్‌’ రాజు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement