భారతదేశంలో అత్యంత వ్యయప్రయాసలతో నిర్మించిన ‘రామాయణ్’ చిత్రంలో రణ్బీర్ కపూర్ కథానాయకుడు కావచ్చు కానీ మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న సాకర్ మ్యాచ్లు చూస్తూ కేరింతలు కొట్టే ఫుట్బాల్ క్రీడాభిమాని కూడా. నిరుపేద పిల్లలను ఆదుకునేందుకు నిధుల సేకరణకోసం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన 18 మంది బాలీవుడ్ ప్రముఖులతో కూడిన ఆల్ స్టార్ ఫుట్బాల్ క్లబ్లో సభ్యుడు. అయితే ఫుట్బాల్పై అభిమానం అంతటితో ఆగిపోలేదు.
జీవితంలో ఓ భాగం
‘రణబీర్ ఎంత పెద్ద ఫుట్బాల్ అభిమాని అంటే... కేవలం ఒక మ్యాచ్ చూడటం కోసమే ఆయన ఒక్కరోజులో బార్సిలోనా దాకా ప్రయాణించేవాడు’’ అంటూ ఆ క్లబ్ భాగస్వామి బిమల్ పరేఖ్ గుర్తు చేసుకుంటారు. ఫుట్బాల్పై అమితమైన ఆసక్తి ఉన్న రణబీర్ కపూర్, గత 2014లో ‘ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్’ను కొనుగోలు చేశారు. ఒకే సీజన్ లో ‘లీగ్ విన్నర్స్ షీల్డ్’’ఐఎస్ఎల్ కప్’ టైటిల్ రెండింటినీ గెలుచుకున్న మొదటి క్లబ్గా ఆయన క్లబ్ నిలిచింది. ఆ తర్వాత, కూడా రెండుసార్లు ఐఎస్ఎల్ లీగ్ విన్నర్స్ షీల్డ్ను కైవసం చేసుకుంది.‘చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ నా జీవితంలో ఒక భాగం, ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్లో ముంబై నగరానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. నాకున్న ఆసక్తిని ఈ క్రీడ అభివృద్ధికి వినియోగించడం సంతోషం కలిగిస్తోంది’’ అంటారు రణబీర్.
నటుడిగా కన్నా ఆటగాడిగానే...
తన బిజీ షూటింగ్ షెడ్యూల్లో కాస్త తీరిక దొరికితే చాలు... రణబీర్ ముంబైలోని ఒక ఫుట్బాల్ మైదానంలో సినీ పరిశ్రమకు చెందిన తన స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడటానికి వెళ్లిపోతాడు. ‘ప్రతి రాత్రి పడుకునే ముందు, నటుడిగానో లేదా స్టార్గానో సినిమా సెట్లో ఉన్నట్టు అనుకోను. ఫుట్బాల్ మైదానంలో 8వ నంబర్ జెర్సీ ధరించిన ఫుట్బాల్ క్రీడాకారుడిగా మాత్రమే నన్ను నేను ఊహించుకుంటాను. దిగ్గజ క్రీడాకారులు మెస్సీ ఇనియెస్టాలకు బంతిని పాస్ చేస్తున్నట్లు కలలు కంటాను’’ అని చెప్పడాన్ని బట్టి రణబీర్ క్రీడాసక్తిని అర్థం చేసుకోవచ్చు.
‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన ఏ క్రీడాకారుడిపైనైనా భవిష్యత్తులో క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేయాలని కోరుకుంటున్నాను,’’ అని కూడా రణబీర్ చెప్పాడు. ’‘ఫుట్బాల్ ఆట ఆడటం వల్ల అడ్రినలిన్ పెరుగుతుంది, ఇది ప్రేక్షకులను అత్యంత లీనమయ్యేలా చేసే ఆట. దీనిలోని ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తూనే ఉంటుంది’’ అని అంటారాయన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులైన ప్రేక్షకులతోపాటు ఆయన కూడా ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నారు.
– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్


