‘రామాయణ’ ఈ వెర్షన్‌లో 30 నిమిషాల నిడివి తగ్గింపు! | Ramayana Part One Ranbir Kapoor Sai Pallav Yash Face the Ultimate Test | Sakshi
Sakshi News home page

రూ.4 వేల కోట్ల ‘రామాయణ’.. అసలు పరీక్ష ఎవరికంటే?

Sep 20 2026 1:46 PM | Updated on Sep 20 2026 2:17 PM

Ramayana Part One Ranbir Kapoor Sai Pallav Yash Face the Ultimate Test

ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మూడు గంటలకు పైగానే..
భారతీయ వెర్షన్‌ మూడు గంటలకు పైగా రన్‌టైమ్‌తో విడుదల కానున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇంగ్లీష్‌ వెర్షన్‌ను మాత్రం దాదాపు 30 నిమిషాల తక్కువ నిడివితో రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. అక్కడి ఆడియన్స్‌ టేస్ట్‌కు అనుగుణంగా కొన్ని పాటలు, సన్నివేశాలను కట్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

రణ్‌బీర్‌కు మరో కొత్త ఛాలెంజ్‌..
‘యానిమల్‌’ వంటి వైలెంట్‌ క్యారెక్టర్‌ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. మర్యాద పురుషోత్తముడిగా ఆయన ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ ఇస్తారనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీకి కారణమవుతోంది. రాముడి పాత్రలో రణ్‌బీర్‌ ఎలా కనిపిస్తాడో, ఆ పాత్రను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.

సాయిపల్లవికి కూడా కీలకమే..
సాయిపల్లవి ఇప్పటికే దక్షిణాదిలో తన సహజమైన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘ఏక్‌ దిన్‌’తో హిందీ ప్రేక్షకులను పలకరించినా.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చర్చ ఉంది. ఇప్పుడు ‘రామాయణ’లో సీత పాత్ర ఆమెకు మరింత కీలకంగా మారింది. బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఆడియన్స్‌ను కూడా సీతగా మెప్పించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.

యశ్‌ ఏం చేస్తాడో?
‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ ‘రామాయణ’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన యశ్‌.. రావణుడి పాత్రలో ఎలా కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఒక్కోసారి మార్పులు..భారీ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న ‘రామాయణ’ విషయంలో మేకర్స్‌ ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. టీజర్‌ విజువల్స్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో తర్వాతి ప్రమోషనల్‌ కంటెంట్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌, లైటింగ్‌, కలర్‌ గ్రేడింగ్‌పై మరింత ఫోకస్‌ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ‘జై జై రామ్‌’ పాటలోనూ విజువల్స్‌ మరింత మెరుగ్గా కనిపించాయి. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రణ్‌బీర్‌, సాయిపల్లవి, యశ్‌.. ఈ ముగ్గురి కెరీర్‌లో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్‌ చూపిస్తుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement