
‘‘కొన్ని క్షణాలు మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్గారితో సమయం గడపడం అలాంటిదే. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనల్లోని స్పష్టత నిజంగా స్ఫూర్తిదాయకం’’ అంటూ పూరి కనెక్ట్స్ ‘ఎక్స్’ ఖాతాలో విజయేంద్ర ప్రసాద్, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు ఈ సంస్థ ప్రతినిధులు. దాంతో రచయిత విజయేంద్ర ప్రసాద్–దర్శకుడు పూరి జగన్నాథ్ ఎందుకు కలిశారు? అనేది హాట్ టాపిక్గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా కథా చర్చల కోసమే విజయేంద్ర ప్రసాద్ని పూరి కలిశారనే ఊహాగానాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. జూన్ చివర్లో చిత్రీకరణను ప్రారంభించేందుకు హైదరాబాద్, చెన్నై లొకేషన్స్ను రెక్కీ చేస్తున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగానే విజయేంద్ర ప్రసాద్ను పూరి జగన్నాథ్ కలిసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.