Aadavallu Meeku Joharlu Movie: అమెరికాలో 300 స్క్రీన్​లలో విడుదల చేస్తున్నాం: నిర్మాత

Producer Sudhakar Cherukuri About Aadavallu Meeku Joharlu Movie - Sakshi

నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. మహిళలు ఎక్కువగా ఉండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు ఉంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్​తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈనెల 4న శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి బుధవారం (మార్చి 2) మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు.

డేట్స్​ వల్ల ఆలస్యమైంది
`పడి పడి లేచె మనసు` తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖుష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరు నెలలు ఆలస్యమయింది.

అందరికీ కనెక్ట్​ అవుతాయి
ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు ఉన్న కుటుంబంలో ఒకే మగాడు ఉంటే అతనిపై ఉన్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను. మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కుటుంబసభ్యులతో ఉన్నట్లు అనిపించింది
ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్​తో చేస్తానని అనుకోలేదు.  నా కుటుంబసభ్యులతోనే ఉన్నట్లు అనిపించింది. కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తాడు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కొవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం.

మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి
శర్వానంద్​తో ఇది రెండో సినిమా. తను నిర్మాతగా కాకుండా సోదరిడిలా ట్రీట్ చేశాడు. పడిపడి లేచె మనసు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి సినిమా ఉంటే చేద్దామని అనుకున్నాం. సినిమా సక్సెస్ కాకపోయినా బెటర్మెంట్​గా చేయాలని మరో సినిమా చేశాం. ఏదైనా మన పని మనం నిక్కచ్చిగా చేసుకోవాలి. నిర్మాణంలో పలు విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. నేను సినిమారంగంలోకి ఇష్టంతోనే వచ్చాను. యు.ఎస్​లో ఐటీ కంపెనీ ఉండేది. కుమార్తె పుట్టాక ఇండియా వచ్చేశాం. ఎర్నేని నవీన్, 14 రీల్స్ వారు అంతా స్నేహితులే. 

కావాల్సినంత ఎంటర్​టైన్​మెంట్​..
`ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం కొవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్​కు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లిదండ్రులు ఉంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్​టైన్​మెంట్​ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్​టైన్​ చేస్తాయి.

మంచి సినిమా చేయడమే నా కల
ఈ చిత్ర కథ రాజమండ్రిలో జరిగేది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం. ఇంతకుముందు `పడిపడి..` సినిమాను రూ. 33 కోట్లతో తీశాం. ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. మరో మంచి సినిమా తీయాలనే ముందడుగు వేస్తున్నా. అందుకే వరుసగా నాలుగు సినిమాలను తీయగలుగుతున్నా. ప్రొడక్షన్ పరంగా శ్రీకాంత్ సహకారం ఎంతో ఉంది. నిర్మాతగా డ్రీమ్ అనేవి వుంటాయి. మంచి సినిమా చేయడమే ప్రస్తుతం ముందున్నది. 

రష్మికను కథ ప్రకారమే తీసుకున్నాం
నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా `విరాటపర్వం` 1945 నక్సల్స్ బ్యాక్​డ్రాప్​, నాని దసరా చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బ్యాక్​డ్రాప్​ కథ. సెట్ కూడా వేస్తున్నాం. రష్మికను కథ ప్రకారం ఆమె బాగుంటుందని ఎంపిక చేశాం. దేవీశ్రీ ప్రసాద్ నాలుగు పాటలు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆదరణ పొందాయి. ఐదో పాట కూడా ఉంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది. సినిమాను అమెరికాలో 300 స్క్రీన్స్​లో విడుదల చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణలోనూ  ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అని ముగించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top