ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడంతో విఫలమైంది. సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
అయితే ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని నెలలుగా కింగ్డమ్ పార్ట్-2పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని చాలాసార్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.
ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కింగ్డమ్-2 సీక్వెల్ ఆలోచన తమకు లేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో తమ సినిమాపై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టేశారు నిర్మాత. అయితే తాము గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ మరో మూవీతో బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత మాతో కలిసి పనిచేస్తారని నాగవంశీ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కింగ్డమ్-2 గురించి ఆశలు వదులుకోవాల్సిందే.
ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'రౌడీ జనార్ధన మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2026లోనే విడుదల కానుంది.


