దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేగంగా ఎదిగిన కథానాయకి ప్రియాంక మోహన్. ఈ కన్నడ భామ డాక్టర్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యక పాటలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.
కాగా ఈమె తాజాగా నటించిన మేడిన్ కొరియా చిత్రం శుక్రవారం నుంచి నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను చాలా విషయాలను ఎదుర్కొంటున్నానని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. విమర్శలతో పాటూ చాలా ట్రోలింగ్లు చేయడానికే ఓ టీమ్ పని చేస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. తనపైనే కాకుండా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు గురించి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. డబ్బులిచ్చి మరీ ఇలా ట్రోలింగ్ ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
తాను జీవితంలో చాలా విషయాలు జరిగాయని, వాటి గురించి ఇప్పుడు పూర్తిగా వివరించడం ఇష్టం లేదన్నారు. అయితే అలాంటి విషయాలతో చాలా నేర్చుకుంటూ, తనను తాను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనవరకు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది స్థిరత్వం లేని పరిశ్రమ అన్నారు. ఇక్కడ ఏదైనా, ఎవరికై నా జరుగుతుందన్నారు. ఇక్కడ అణగదొక్కడానికి కొందరు ఉంటారని, అయితే జీవితంలో కిందపడితే అది ఒక మెట్టు పైకి ఎక్కడానికే అని తాను భావిస్తానని అన్నారు. ఇలా చాలా విషయాలను నేర్చుకుంటూ దాన్ని తన పనిలోనూ, జీవితంలోనూ ఉపయోగించుకుంటున్నానని ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.


