‘‘బుచ్చిబాబు రాసిన ‘పెద్ది’ కథలో మా హీరో రామ్ చరణ్గారు అద్భుతంగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్గారి పెర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యతి. మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారు’’ అని నిర్మాత వై. రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) తెలిపారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్మీట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా ‘పెద్ది’. పిల్లలకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు.
వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ తొలి రోజే రూ. 135 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. ఇది రామ్ చరణ్గారి కెరీర్లోనే బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి’’ అని తెలిపారు. బుచ్చిబాబు మాట్లాడుతూ– ‘‘పెద్ది’ విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు. ‘ఉప్పెన’ సమయంలోనూ ఇదే జరిగింది. అయితే ‘ఉప్పెన’ కంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ‘పెద్ది’ కి వస్తోంది’’ అన్నారు. ‘‘రామ్ చరణ్గారి కెరీర్లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డ్ ఇది. ఈ సినిమా మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని నమ్ముతున్నాను’’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ చెప్పారు.


