‘పెద్ది’ వివాదం.. అనసూయ సంచలన పోస్ట్‌ | Peddi Controversy: Anasuya Bharadwaj Latest Post Goes Viral | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ వివాదం.. అనసూయ సంచలన పోస్ట్‌

Jun 6 2026 2:42 PM | Updated on Jun 6 2026 3:07 PM

Peddi Controversy: Anasuya Bharadwaj Latest Post Goes Viral

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రపై  విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెరపై ఆమెను చూపించిన తీరుపై, కొన్ని సీన్లపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా నటి, యాంకర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. 

సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను ముడిపెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు.

ఒకప్పుడు నైతికత..ఇప్పుడు గందరగోళం
‘ఒకప్పటి సినిమాల్లోని కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు స్ఫూర్తిదాయకంగా, విలన్ పాత్రలు మనం అనుకరించకూడదనే విధంగా ఉండేవి. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ స్పష్టత లోపిస్తోంది. కేవలం పాత్రను గొప్పగా చూపించడం కోసమే దర్శకులు ఈ విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక కథను తెరకెక్కిస్తున్నప్పుడు సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో.. సాంకేతిక నిపుణుల నుంచి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్రధారులే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి.

నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా..
నేను కూడా గతంలో సృజనాత్మకత విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్లే కొన్ని షోల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల నా ప్రతిభకు తగిన అవకాశాలు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిద్ధాంతాల కోసమే నిలబడ్డాను.

ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు
సినిమాలకు సృజనాత్మక స్వేచ్ఛ ఎంత అవసరమో, సామాజిక స్పృహ ఉండటం కూడా అంతే ముఖ్యం. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయని ఆశించకూడదు. అలాగని, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోలేం. సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాలపై చర్చలు జరపడం, కథల్లో పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం వంటివి చూస్తుంటే తనకు సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు, అది సమాజంలో అవగాహన పెంచడమే. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ఈ చిత్ర పరిశ్రమ అనే వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే నా ఉద్దేశం. ఇకనైనా క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు,  ఆడియన్స్ మరింత సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా కంటెంట్‌ను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’ అని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement