సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.
పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. టాలీవుడ్లో శివకార్తికేయన్కు భారీ క్రేజ్ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే.

1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు.


