లిటిల్ స్టార్ నుంచి లిటిల్ సూపర్స్టార్ వరకు ఎదిగిన నటుడు శింబు. ఈయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాబోతోందంటేనే అభిమానులకు పండగ. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా బాధ పడరు. శింబు కొత్త చిత్రంలో నటించడమే చాలు అభిమానులకు. కాగా ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కమలహాసన్తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్స్ లైఫ్ చిత్రం డిజాస్టర్గా మారింది.
ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా శింబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం షురూ అయ్యింది. దీన్ని డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు తెరకెక్కించనున్నారు. వరుస విజయాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం శింబు పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం శింబు నటిస్తున్న అరసన్ చిత్రం పూర్తి అయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకనటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కొద్ది రోజులు ఆగండి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని దర్శకుడు అశ్వద్ మారిముత్తు ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న శింబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే పుల్ ఖుషీ అవుతున్నారు.


