పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.
నా కూతురే ఒక అద్భుతం
హీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి.
కిలో కంటే తక్కువ బరువు
భవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్కు తీసుకెళ్లాం.
ఫలించిన నిరీక్షణ
మూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.
చదవండి: చంద్రహాస్పై కేసు నమోదు


