ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి | Actress Jayavahini passed away | Sakshi
Sakshi News home page

ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి

Feb 5 2026 10:15 AM | Updated on Feb 5 2026 11:03 AM

Actress Jayavahini passed away

టాలీవుడ్‌లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్‌ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.  తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.

ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని  బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్‌ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.  కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

ఎవరీ వాహిని?
విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్‌ అయింది. చివరగా పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.  నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.

కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు.  బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement