
కొందరు సెలబ్రిటీల చిన్న చిన్న కోరికలు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈ లేడీ సూపర్స్టార్ జీవితమే సంచలనం అని చెప్పవచ్చు. అన్నింటికీ మించి మనోధైర్యం నిండుగా ఉన్న నటి. కాకపోతే తన జీవితంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని, ఈ స్థాయికి చేరుకునేవారే కాదు. వృత్తిని, వ్యక్తిగతాన్ని చాలెంజ్గా తీసుకుని, అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి నయనతార. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ సంచలన తార ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినా కానీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడంలో ఇప్పటికీ వెనుకాడడం లేదు.
రెండు దశాబ్ధాలుగా అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న ఈ కేరళ భామ తల్లిదండ్రులు ఇప్పటికీ కేరళలోని కొచ్చిలోనే నివసిస్తున్నారన్నది తెలిసిందే. కాగా ఇటీవల తన తండ్రి కురియన్ పుట్టిన రోజు సందర్భంగా నయనతార కుటుంబ సమేతంగా కొచ్చికి వెళ్లారు. కాగా ఇటీవల ఒక రోజు అర్ధరాత్రి భర్తను, పిల్లల్ని వదిలి ఆ సమీపంలోని ఎంజీ రోడ్డుకు వచ్చారు. అంత అవసరం ఏమోచ్చిందంటారా? అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఐస్క్రీమ్ కొట్టుకు వెళ్లి ఐస్క్రీమ్ కొనుక్కొని హాయిగా తినడం మొదలెట్టారు.
విశేషం ఏమిటంటే ఆ ప్రాంతంలో నయనతార భారీ కటౌట్ ఒకటి ఉంది. దాన్ని చూస్తూ నయనతార ఐస్క్రీమ్ తిన్నారు. అంతటి సెలబ్రిటీ అర్ధరాత్రి నడిరోడ్డుపై నిలబడి ఐస్క్రీమ్ తింటుంటే ఎవరి కంటా పడకుండా ఉంటుందా? అలా కొందరు అభిమానులు అక్కడికి వచ్చి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నయనతారను విష్ చేశారు. ఈమె కూడా వారితో ముచ్చటించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు అంత రాత్రిపూట ఆమెకు ఐస్క్రీమ్ తినాలని అనిపించడం ఏమిటీ, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు రావడం ఏమిటీ? అనే ఆశ్చర్యాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2024