ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు వందేమాతరం శ్రీనివాస్ తనయుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో దివ్యాని మొండల్ హీరోయిన్గా నటిస్తుండగా, వీరేష్ కోకా దర్శకత్వంలో పి. చక్రధర రెడ్డి నిర్మిస్తున్నారు. ముçహూర్తపు సన్నివేశానికి గంటా రవితేజ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు డాలీ క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు.
నల్లమలుపు బుజ్జి మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో ‘వందేమాతరం’ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘నేను 275కి పైగా సినిమాలకు పనిచేశాను. ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇది.
మంచి కాన్సెప్ట్తో దర్శక–నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నా తొలి సినిమాకే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సుస్వర తరంగ్. ‘‘నిజ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్గారు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటాను’’ అన్నారు వీరేష్ కోకా.


